ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్లో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు కీలక రంగాలపై దృష్టి సారించారు. వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్, పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నూతన సాంకేతికతను పరిచయం చేసి, ఉపాధి అవకాశాలు పెంచడమే ధ్యేయంగా ఈ భేటీలు జరుగుతున్నాయి.ముందుగా, జ్యురిచ్లో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న బ్యూలర్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. బ్యూలర్ ఇండియా ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు దీపక్ మానేతో జరిగిన ఈ భేటీలో ఏపీని అగ్రి-ఫుడ్ హబ్గా మార్చేందుకు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. "ఆంధ్రప్రదేశ్లో బ్యూలర్ ఫుడ్స్ & గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఏపీలోని అగ్రి ఎక్స్పోర్ట్ క్లస్టర్లకు సాంకేతిక మద్దతు అందుతుంది. ముఖ్యంగా, మిల్లెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని రాష్ట్రంలో వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సహకరించండి" అని లోకేశ్ కోరారు. మేక్-ఇన్-ఇండియాలో భాగంగా ఆప్టికల్/కలర్ సార్టర్ తయారీ యూనిట్ను ఏపీలో విస్తరించాలని, తద్వారా స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని వివరించారు. రాష్ట్రంలోని ఫుడ్ పార్కులకు అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు బ్యూలర్ గ్లోబల్ మోడల్తో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రతిపాదనలపై దీపక్ మానే సానుకూలంగా స్పందించారు. భారత్లో బెంగళూరు కేంద్రంగా తమ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయని, ఇప్పటికే కాకినాడలో ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఏపీలో సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తమ బోర్డు దృష్టికి తీసుకెళ్లి, క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.దావోస్లో తన పర్యటనలో భాగంగా, స్పెయిన్కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ సంస్థ ఎండీ జోస్ మెల్లాడోతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, జీరో-ఎమిషన్ వాహనాల రంగంలో ఎవో సంస్థకున్న నైపుణ్యాన్ని ఏపీకి పరిచయం చేయాలని ఆయన ప్రతిపాదించారు. "విశాఖపట్నం, కాకినాడ పోర్టులలో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్ల పైలట్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయండి. అలాగే, రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో వినియోగించే ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆఫ్-రోడ్ వాహనాల అభివృద్ధికి నేతృత్వం వహించండి" అని లోకేశ్ ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన టెస్ట్ బెడ్లు, అనుమతులు, ఇంజనీరింగ్ శాండ్బాక్స్ వంటి అన్ని మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ పైలట్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రోటోటైప్ అభివృద్ధి, ఇంజనీర్ల శిక్షణకు కూడా పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పuష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa