ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేనికైనా సిద్దంగా ఉండాలి-సీఎం వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 11:53 PM

రాష్ట్రంలో ఓమిక్రాన్..కరోనా వంటి పరిస్థితులు చేయిదాటకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు  ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సకు సిద్ధంగా ఉంచాలని,  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారందరికీ టీకాలు వేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం, ఏపీలో  6 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ కోవిడ్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.  టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ సూచించారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. సచివాలయం స్థాయి నుంచి అధికారులు డేటాను తెప్పించుకోవాలని తెలిపారు. దీనిపై వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని అధికారులతో  సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్‌ టీకాలు, 71.76 శాతం రెండో డోస్‌  టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.  నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ను పూర్తి చేశారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్‌ వేశారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa