ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్డోస్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనావేశామని అధికారులు తెలిపారు. మెడికల్ హబ్స్ ఏర్పాటు ప్రగతిపైనా అధికారులతో చర్చించారు. కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే కోవిడ్ గుర్తించే పరీక్షలు చేయాలని, విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పర్యాటకులను రెగ్యులర్గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్.. పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్ను కూడా వెంటనే ట్రెసింగ్ చేయాలన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి పూర్తికాగానే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. మెడికల్ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa