గుంటూరు: ప్రియుడిని హతమార్చిన కొడుకును కాపాడుకునేందుకు ఓ మహిళ ప్రమాదంగా చిత్రీకరించి ఎవరికి అనుమానం రాకుండా మృతుడి బంధువుల సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనంమేరకు.. నగరంలోని అంజిరెడ్డి కాలనీలో ఉంటున్న ఇందిర అనే మహిళ, విజయవాడలోని చుట్టుగుంటకు చెందిన కట్టా రాజా (37) అనే వివాహితుడితో సహజీవనం చేస్తోంది. రాజాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన కొన్నాళ్లుగా వారికి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా రాజా నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఇంటి వద్ద మురుగుగుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఇందిర చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రిలో చేర్చారు. ఆయన డిసెంబరు 29న మృతి చెందడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మృతదేహానికి వైద్యులతో పోస్టుమార్టం చేయించి ఇందిర ఆమోదంతో రాజా బంధువులకు అప్పగించారు. ఆ సమయంలో మృతదేహం పొట్టపై బలమైన గాయాలుండటం గమనించారు. అనంతరం ఇందిర, రాజా భార్య, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు అనుమానంతో ఇందిర కొడుకును స్టేషన్కు పిలిపించి విచారించగా రాజా హత్యకు గురైనట్లు బయటపడింది. డిసెంబరు 29కు నాలుగు రోజుల ముందు రాజాకు ఇందిర కుమారుడు వంశీతో గొడవ జరిగింది. నిందితుడు వంశీని సీఐ సాంబశివరావు అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa