రాష్ట్రాన్ని దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.2024 అక్టోబర్లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలాలను ఇస్తోందని, ఆనాడు తామిచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గర్వకారణమైన మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,000 కోట్లు) సమీకృత పెట్టుబడి వస్తోందని వివరించారు. ఈ పెట్టుబడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే 7.5 గిగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్లాంట్లు కూడా ఏర్పాటవుతాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో ఉన్న సమగ్రమైన క్లీన్ ఎనర్జీ వ్యవస్థకు నిదర్శనమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa