ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాపై కుట్ర:కారుమూరి నాగేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 11:38 PM

తన వెనుక కొంత మంది కుట్రలు పన్నుతున్నారని.. గత ఎన్నికల నుంచే తనకు వ్యతిరేకంగా కొన్ని దుష్ట శక్తులు పని చేస్తున్నాయని తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చకెక్కేట్లు ఉంది.  పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా వున్నారు.  ఈ నెల 2న తణుకులో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ టౌన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే నాగేశ్వరరావు మధ్య వివాదం చోటుచేసుకుంది. తాను లేకుండానే కార్యక్రమాలు ఎలా చేస్తారని ఎమ్మెల్యే నిలదీశారు. తమ్ముడూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నావా అని పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రెడ్డిని నిలదీశారు. అయితే, ఆ సందర్భంలోనే తన తల్లిని ఉద్దేశించి తిట్టారంటూ.. ఎస్ఎస్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ బర్త్ డే చేశానని.. అదే తన కొంప ముంచిందని ఎమ్మెల్యే వాపోయారు. ఇక్కడ అర్జెంటుగా ఓ వ్యక్తి ఎమ్మెల్యే అయిపోవాలని కోరుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎదురుగా వచ్చే వాడితో పోరాడవచ్చని.. కానీ, అతను వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు క్షమశిక్షణతో ఎదిగానని.. తాను ఎవరికీ అపకారం చేయలేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. శత్రువుకు కూడా ఉపకారం చేశానని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో రెడ్లు అందరూ తనకు మద్దతుగా నిలబడ్డారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేశానని కొంత మందికి తనపై ఈర్ష్యగా ఉందని దుయ్యబట్టారు. ఎదురుగా వస్తే పోరాడ వచ్చని.. కానీ, వెనుక నుంచి పొడిచే వాళ్లను ఎక్కడ తట్టుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే కారుమూరి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa