హెచ్ఆర్ఏపై 8, 24, 16 స్లాబులను మాత్రం ఆమోదించవద్దని అధికారులకు స్పష్టం చేసినట్టు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ తో నిన్న ఉద్యోగ సంఘాల భేటీ కావడం, ఆపై సీఎం జగన్ ఫిట్ మెంట్, పీఆర్సీ ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు నేడు సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాకు వివరాలు తెలిపారు. నిన్న సీఎం ప్రధాన అంశాలు చర్చించారని, మిగిలిన అంశాలను అధికారులతో చర్చించాలని కోరడంతో తాము ఇవాళ సమావేశమయ్యామని వివరించారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, హెచ్ఆర్ఏపై ఇప్పుడున్న స్లాబులను ఉంచాలని, లేకపోతే పీఆర్సీ కమిషనర్ ప్రతిపాదించిన కొత్త స్లాబులైనా అమలు చేయాలని కోరామని చెప్పారు. అయితే హెచ్ఆర్ఏపై 8, 24, 16 స్లాబులను మాత్రం ఆమోదించవద్దని అధికారులకు స్పష్టం చేసినట్టు వెల్లడించారు. హెచ్ఆర్ఏ అంశంలో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను వారికి వివరించామని తెలిపారు. ఫిట్ మెంట్ తో పాటు అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏ తదితర అంశాలపై అధికారులకు స్పష్టంగా వివరించామని బొప్పరాజు వెల్లడించారు. ముఖ్యంగా, అదనపు పింఛను 80 ఏళ్ల నుంచి ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫారసును ఆమోదించవద్దని, ప్రస్తుతం ఉన్న పింఛను విధానాన్నే కొనసాగించాలని చేయాలని కోరినట్టు తెలిపారు. అదనపు పెన్షన్ పై సీఎస్ కమిటీ సిఫారసులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందిపడతారన్న అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీఎం ప్రకటించగా మిగిలిన అంశాలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని బొప్పరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. అలాగే త్వరలో ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం చెప్పడం కూడా తమకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa