నన్ను ఆశీర్వదించండి మళ్లీ గెలిపించండి అని ఎంపీ రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గ ప్రజలను కోరారు. దీంతో నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామాకు సిద్ధమవుతున్నారా..తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల మర్మమేమిటి. ఆయన ఇప్పుడు ఉప ఎన్నిక గురించే మాట్లాడుతున్నారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలు మరోసారి తనకు మద్దతుగా నిలవాలని, ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సర్కారుకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోయేంతగా పరిస్థితులు ఉన్నాయని అన్నారు. క్షవరం అయిందన్న సంగతి ఓటర్లకు ఇన్నాళ్లకు తెలిసిందని, క్షవరం అయితే తప్ప వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పీఆర్సీ కొనసాగితే చాలని ఉద్యోగులు భావిస్తున్నారని వివరించారు. తనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలని రఘురామ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే రఘురామ నరసాపురం వస్తున్నానని ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అందులో ఓ వైపు రఘురామ, మరోవైపు పవన్ కల్యాణ్ ఉండడం గమనార్థం. పైగా, పవన్ కల్యాణ్ కు ఇష్టమైన 'పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప' అనే నినాదం కూడా ఆ ఫ్లెక్సీలపై దర్శనమిస్తోంది. ఇటీవల రఘురామ మాట్లాడుతూ తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa