ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై పోరు స్పూర్తిదాయకం: రాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 03:24 PM

కరోనా మహమ్మారిపై భారత్ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిపై భారత్ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందని ఆయన ప్రశంసించారు. ప్రతి భారతీయుడికి ఆజాద్‌కి అమృత మహోత్సవ్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులర్పించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని కోవింద్ కితాబిచ్చారు. ‘‘దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నాం.. దేశ సురక్షిత భవిష్యత్తు కోసం గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ముఖ్యం.. గత స్మృతుల నుంచి నేర్చుకోవడం ముఖ్యం.. కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం కలిసి పనిచేశాయి.. దేశంలో 70 శాతం మంది అర్హులకు రెండు డోస్‌ల వ్యాక్సిన్తు పూర్తయ్యాయి.. కరోనాపై పోరాటంలో వ్యాక్సిన్లది కీలక పాత్ర.. ఏడాది కన్నా తక్కువ సమయంలో 150 కోట్ల డోస్‌లను అందజేయగలిగాం.. ఫ్రంట్‌ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్‌లు కూడా ఇస్తున్నాం. కరోనా నేపథ్యంలో మా ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టింది.. రూ. 64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టాం.. 8వేల జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే మందులను అందజేస్తున్నాం.. కరోనా కాలంలోనూ ఫార్మా సంస్థలు సత్తా చాటాయి.. ఆయుష్ ఉత్పత్తులు రూ.11 వేల కోట్లకు పెరిగాయి.. అంత్యోదయ అన్నదే మూల మంత్రంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది.. పేదలందరికి ఉచిత రేషన్ పథకాన్ని మార్చి 2022 వరకూ పొడిగించాం.. అన్ని వర్గాల అభ్యున్నతే మా ప్రభుత్వ లక్ష్యం.. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది సంకల్పం.. అందుకు ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులే నిదర్శనం. వీధి వ్యాపారులను ఫుడ్ డెలివరీ యాప్‌లతో అనుసంధానం చేస్తున్నాం.. కరోనా కాలంలోనూ మన రైతాంగం రికార్డుస్థాయిలో ఉత్పత్తి సాధించిది.. తేనె ఉత్పత్తిలో గతేడాదితో పోల్చితే 55 శాతం వృద్ధి సాధించాం.. రైతుల ఉత్పత్తుల కోసం 150 కిసాన్ రైళ్లను నడిపాం.. దేశంలో వర్షపునీటి సంరక్షణ కోసం పథకాలను చేపట్టాం.. అటల్ భూ జల్ పథకాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు రూ.65 వేల కోట్ల రుణాలు మంజూరు చేశాం.’’ అని అన్నారు. ‘‘ఇంటింటికి తాగు నీరు అందజేయాలనే ఉద్దేశంతో జలజీవన్ మిషన్‌ను ప్రారంభించాం.. సంకల్పం ఉంటే మార్గాలు వాటంతట అవే వస్తాయనడానికి ఇవే నిదర్శనం.. ముద్ర రుణాలు విజయవంతమవుతున్నాయి.. ప్రపంచంలో తక్కువ ధరకు ఇంటర్నెట్ అందజేస్తున్న దేశంగా భారత్ నిలిచింది.. ప్రభుత్వ చర్యల వల్లనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది.. దేశంలో గతేడాది భారీగా పెరిగిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనం.. సెల్ ఫోన్‌లు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో దేశంగా భారత్ నిలిచింది’’ ట్రిపుల్ తలాక్ వంటి నిబంధనలను తొలగించాం.. మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాం.. క్రీడా రంగంలోనూ మన యువత సత్తా చాటుతోంది.. టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డుస్థాయిలో మన క్రీడాకారులు 7 పతకాలు సాధించారు.. భవిష్యత్తులో భూ, సముద్ర, వాయు మార్గాలను ఒకే పరిధిలోకి తీసుకొస్తామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa