ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదులపై వీరోచిత పోరాటం...ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాడు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 03:26 PM

ఆ దేశ సైనికుడికి యావత్ దేశం సలాం కొట్టాలి. బుల్లెట్ లు దిగినా తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులపై విరుచుపడ్డాడు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్‌లలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పుల్వామాలో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయాలైనా లెక్క చేయకుండా.. ఒక్క సైనికుడే ముగ్గుర్ని మట్టుబెట్టి వీరోచితంగా పోరాడాడు. పుల్వామాలోని నైరా గ్రామం వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో శనివారం సాయంత్రం ఆర్మీకి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, గరుడ్‌ కమాండోలు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేస్తూ ఉగ్రవాదులు నక్కిన ఇంటిని గుర్తించారు. వెంటనే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. ఆ ఇంటిని చుట్టుముట్టారు. సైన్యం రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో గరుడ్‌ కమాండో స్క్వాడ్రన్‌ లీడర్‌ సందీప్‌ ఝాజరియా శరీరంలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి ఆయన ఛాతిలోకి, మరొకటి ఎడమ చేతిలోకి దిగాయి. అయినాసరే, తూటా గాయాలను లెక్కచేయకుండా సైనికుడు పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టాడు. ఆ తర్వాత అక్కడే నక్కి ఉన్న మరో ఉగ్రవాది కాల్పులు జరపడంతో కార్పొరల్‌ ఆనంద్‌ గాయపడ్డాడు. అప్రమత్తమైన దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆ ఉగ్రవాదీ హతమయ్యాడు. ఇదిలావుంటే వాయుసేనకు చెందిన గరుడ్‌ ప్రత్యేక దళానికి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్‌లో అనుభవం గడించేందుకు కశ్మీర్‌లోని రాష్ట్రీయ్‌ రైఫిల్స్‌కు అనుసంధానం చేశారు. 2017లో హజిన్‌ వద్ద జరిగిన రెండు ఆపరేషన్స్‌లో గరుడ్‌ కమాండోలు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ఎనిమిది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొని అమరుడైన కార్పొరల్‌ జేపీ నిరాలకు మరణానంతరం అశోక చక్ర పురస్కారం వరించింది. వింగ్‌ కమాండర్‌ రాజీవ్‌ చౌహాన్‌కు వాయుసేన గ్యాలంటరీ అవార్డు దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa