ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే దారి మధ్యలోనే ఆ మహిళ డబ్బు, నగలతో మాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ కిలేడీ తనలాగే మరో ఏడుగురిని పెళ్లాడి, మోసం చేసిందని తెలుసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాకు చెందిన దశరథ్ పటేల్(41) అనే వ్యక్తికి ఇటీవలే అర్చన(40) పరిచయమైంది. బంధువుల అమ్మాయి అని చెప్పి ఊర్మిళా అహిర్వార్(28) అలియాస్ రేణు రాజ్పుత్ తో అర్చన అతనికి పెళ్లి కుదిర్చింది. సియోని పొరుగు జిల్లా జబల్పుర్లో మంగళవారం దశరథ్-ఊర్మిళల వివాహం జరిగింది. వధువు బంధువుల్లా అర్చన, అమర్ సింగ్(50) హాజరయ్యారు. దశరథ్ తన దగ్గరున్న డబ్బు, నగలను ఊర్మిళ, అమర్ దగ్గర ఉంచమని ఇచ్చాడు. భార్యతో కలిసి తన ఇంటికి బయలుదేరాడు.
కాస్త దూరం వెళ్లాక తనకు ఒంట్లో బాగాలేదని, ఒకసారి కిందకు దిగుతానని ఊర్మిళ చెప్పింది. అదే సమయానికి భాగ్చంద్ కోరి(22) అనే యువకుడు బైక్పై వచ్చాడు. కారులోని డబ్బు, నగలు తీసుకున్న ఊర్మిళ ఆ బైక్పై ఎక్కి పారిపోయింది. దశరథ్ వెంటనే ఓమ్టీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించి గురువారం ఊర్మిళ అలియాస్ రేణు రాజ్పుత్, అర్చన, భాగ్చంద్, అమర్ సింగ్ను అరెస్టు చేశారు. వీళ్లు గతంలో ఇలానే ఏడుగురిని మోసం చేశారని, పెళ్లి చేసుకుని డబ్బు, నగలతో పరారైనట్లు విచారణలో ఊర్మిళ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితులంతా రాజస్థాన్లోని జైపుర్, కోట, ధోల్పుర్, మధ్యప్రదేశ్లోని దామోహ్, సాగర్కు చెందిన వారని వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa