పెళ్లైన నలభై రోజులకే నవదంపతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన మహానంది(30) ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాయ్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ప్రియాంక(24)తో అతనికి గతేడాది డిసెంబర్ 28న వివాహమైంది.
మహానంది సంక్రాంతి తర్వాత ప్రియాంకను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి విధులకు వెళ్లారు. ఇటీవల కానిస్టేబుళ్ల భర్తీ ప్రకటన విడుదల కావడంతో పరీక్షలకు సిద్ధం కావాలని మహానంది ఫోన్ లో భార్యను కోరారు. ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు సంభాషణ సాగిందని ఇద్దరి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 4న ప్రియాంక పుట్టింటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న మహానంది ఆదివారం ఉదయం ఒంగోలు వచ్చారు.
ఒంగోలు చేరుకున్న మహానంది తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేనని చెప్పారు. ఉదయం 5 గంటల సమయంలో వాసు అనే స్నేహితుడి ఫోన్ కి తాను గుండ్లకమ్మ జలాశయం దగ్గర ఉన్నానని, చనిపోతున్నట్టు మహానంది మెసేజ్ పంపారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఒంగోలు, అద్దంకి అగ్నిమాపక సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని బోట్ల సహాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో మహానంది మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల వ్యవధిలోనే నవ దంపతులు బలవన్మరణాలకు పాల్పడటంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa