కోడి పందేల్లో చూసేందుకు వెళ్లిన ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పందెంలో కోడికి కట్టిన కత్తి ప్రమాదవశాత్తూ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. ఏపీలో చిత్తూరు జిల్లా పెదమండ్యం మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రభాకర రెడ్డి దశదిన కర్మలో భాగంగా మండలంలోని కలిచెర్లలో కోడిపందేలు ఏర్పాటు చేశారు. దీనికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కలిచెర్లకు భారీగా జూదరులు, స్థానికులు తరలివచ్చారు. గంగులప్ప(40) అనే వ్యక్తి తన అన్న వెంకటరమణతో కలిసి కోడి పందేలు చూసేందుకు వెళ్లగా అనుకోని ప్రమాదం ఎదురైంది. కోడిపందేల్లో ఓ కోడి హఠాత్తుగా గంగులప్పపై పడగా, దానికి కట్టిన కత్తి తగిలి తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచాడు. కోడి కాలికి కట్టిన కత్తికి విషం పూసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ కోడిపందేల విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవి మనోహరా చారి నిర్వాహకులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa