ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో మరో పుణ్యక్షేత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 03:10 PM

పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని దివ్యచరిత్రను తెలిపే రామాయణ మహాకావ్యంలో కీలక పాత్రధారి, దాసభక్తికి ప్రతీక అయిన హనుమంతుని జన్మస్థలంపై దశాబ్దాలుగా చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. హనుమంతుని జన్మస్థలం కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రమేనని కొందరు, మహారాష్ట్రలోని మరో ప్రాంతమని మరికొందరు వాదిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి చెందిన ఏడుకొండల్లో హనుమంతుని తల్లి అంజనాదేవి పేరున వెలసిన అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమనే వాదన కూడా దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం నుంచి వినవస్తోంది.


ఆ వాదనకు అనుబంధంగా వివిధ రూపాలలో తమ దృష్టికి వచ్చిన ఆధారాలపై టీటీడీ ప్రస్తుత కార్యనిర్వహణాధికారి జవహర్‌ రెడ్డి దృష్టి సారించారు. సత్యాసత్యాలను తెలుసుకోడానికి 2020లో దాదాపు నాలుగైదు నెలల పాటు పౌరాణిక, చారిత్రక, పరిశోధనా రంగాలకు చెందిన సుప్రసిద్ధ పండితులు, శాస్త్ర నిపుణులతో ప్రత్యేక అధ్యయనం చేయించారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత హనుమంతుడు తిరుమల కొండల్లోని అంజనాద్రి ప్రాంతంలోనే జన్మించారని నిర్ధారించిన ఆ నిపుణుల బృందం శాసన, పౌరాణిక ఆధారాలతో నివేదికను సిద్ధం చేసింది.


ఆ ఆధారాలు శివపురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండపురాణం, వరాహపురాణం, మత్స్య పురాణాలలో శ్రీ వేంకటాచల మహాత్య్మంలో, వరాహమిహిరుడు రచించి బృహత్ సంహితలో లభించాయని ఆ నిపుణులు వెల్లడించారు. ఆ అధ్యయన నివేదికను గత ఏడాది శ్రీరామనవమి పర్వదినాన బహిరంగపరచిన టీటీడీ తిరుమలలోని అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని సాధికారికంగా ధ్రువీకరించింది. దానిపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చిన హంపి హనుమత్ పీఠాధిపతి వంటి వారి సందేహాలను ఆ నిపుణుల కమిటీ చర్చా గోషి ద్వారా తీర్చగలిగింది.


మరో అడుగు ముందుకు..


తిరుమలలోని అంజనాద్రి ప్రాంతంలో హనుమంతుని జన్మస్థలాన్ని చాటిచెప్పే విధంగా టీటీడీ మరో అడుగు ముందుకేసింది. ఆ ప్రాంతంలో ఒక మహామందిరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఆ నిర్మాణానికి అవసరమైన నిధులను టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులైన నాగేశ్వరరావు, మురళీకృష్ణ సమకూర్చనున్నారు.


తెలంగాణలోని యాదాద్రి మహాక్షేత్ర నిర్మాణ రూపశిల్పి అయిన ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి ఆ మహామందిర నమూనా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇప్పటికే సంబంధిత నమూనా చిత్రాలను టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి అందచేశారు. ఈ చారిత్రక నిర్మాణ కార్యక్రమానికి అంజనాద్రి ప్రాంతంలో ఈ నెల 16వ తేదీన భూమిపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి గతవారం ప్రకటించారు.


ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందతో పాటు శ్రీరామజన్మభూమి నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి మహరాజ్, చిత్రకూట మఠాధిపతి రామభద్రాచార్యులు తదితర ఆధ్యాత్మికవేత్తలను ఆహ్వానించినట్టు కూడా ఆయన తెలిపారు. ఆ సందర్భంగా అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారించే ఆధారాలతో రూపొందించిన శాస్త్రీయ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడానికి టీటీడీ సన్నద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa