స్మార్ట్ ఫోన్ల రాకతో సెల్ఫీల మోజు ప్రజల్లో ఎక్కువైంది. ఒకానొక సమయంలో ఇది ప్రమాదకరంగా మారుతున్నా ప్రజల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. సెల్ఫీ మోజులో పడి ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. కొందరు యువకులు రైల్వే ట్రాక్పై సెల్ఫీలు తీసుకుంటుండగా లోకల్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లోని కోస్సీ నదిపై రైల్వే వంతెన సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు పిక్నిక్ కోసం అక్కడికి వచ్చారని, రైలు పట్టాలపై స్నేహితులతో సెల్ఫీలు దిగుతుండగా మిడ్నాపూర్ నుంచి హౌరా వెళ్తున్న లోకల్ రైలు వారిని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. అయితే వారిని గమనించిన రైలు డ్రైవర్ చాలాసార్లు హారన్ ఊదాడని, అయినా ఆ యువకులు దానిని పట్టించుకోలేదని చెప్పారు. దాంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. కాగా ఆ యువకుల్లో మిథున్ ఖాన్ (36), అబ్దుల్ గైన్ (32) ఉన్నట్టు గుర్తించారు. నిషేధం విధించినా దానిని లెక్క చేయకుండా చాలా మంది రైలు పట్టాలపై సెల్ఫీలు దిగుతున్నారని, కనీసం ట్రైన్ వస్తుందనే భయం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బిశ్వజిత్ బాలా చెప్పారు. అలా రైలు పట్టాలపై దిగి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. కాగా ఈ సంఘటనపై రైల్వే అధికారులు ప్రాథమిక దర్యాప్తును నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa