ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు హయాంలోనే బీసీల అభివృద్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 01:04 PM

రాష్ట్రంలో వైసీపీ పాలన బీసీలకు శాపంగా మారిందని అనంత పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు క్రిష్ణయ్య, ప్రధాన కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్లమెంటరీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు వైసిపి ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని విమర్శించారు. బీసీలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గద్దెనెక్కిన అనంతరం నేడు ఆదిశగా దృష్టి సారించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను సీఎం. జగన్ తన నవరత్నాలకు మళ్లించి బడుగులను నట్టేట ముంచాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పోరేషన్ కు నిధులు కేటాయించడమేగాని విడుదల చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. సీఎం జగన్ హాయాంలో బీసీ లకు చేయూత కరువైందని తద్వారా కులవృత్తులు చతికిలపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్ర బాబు హాయంలో వృత్తిదారులకు ఆదరణ పథకం క్రింద ఉచితంగా పనిముట్లు. ఇతర యంత్రాలు ఉచితంగా పంపిణీ చేసేవారని గుర్తు చేశారు.


బీసీలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి తీరని ద్రోహం చేస్తోందని వైసీపీ ప్రభుత్వం పై ఏకరవు పెట్టారు. బీసీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడమే కాకుండా ఆదరణ పథకాన్ని అమలుచేసి అర్హులైన వారికి పనిముట్లు పంపిణీచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల్లేని కార్పొరేషన్లను ఏర్పాటుచేసి బీసీలను నిలువునా మోసం చేసిందని దుయ్య బట్టారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడిపి బీసీ సెల్ నగర అధ్యక్షుడు గోపాల్ గౌడ్, నాయకులు సుధాకర్, ఈడిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa