టీటీడీ పరిధిలోని తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగనుంది. అనంతరం సాయంత్రం 6 నుంచి 7. 30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8. 30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
అదేవిధంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 7 నుండి 7. 45 గంటల వరకు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5. 30 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో:
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 5. 30 నుండి 6. 30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది.
శ్రీ కోదండరామాలయంలో:
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa