ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా వచ్చేది అప్పుడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:31 PM

వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి విడత పెట్టుబడి సాయాన్ని ఏపీ ప్రభుత్వం మే నెలలో అందించే ఏర్పాటు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. తొలి విడతలో రూ.7,500, రెండో విడతలో రూ. 4 వేలు, మూడో విడతలో రూ.2 వేలు సాయం అందిస్తుంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ భూ సాగుదారులకు పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల సాయం అందించింది. ఈ పథకం కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,020 కోట్లు కేటాయించింది.

గతేడాది లబ్ధి పొందిన అందరూ ఈ ఏడాది కూడా ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన, అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హులై ఉండి గతంలో లబ్ధి పొందని వారు రైతు భరోసా పోర్టల్‌లోని ‘న్యూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌‘ మాడ్యూల్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) సంప్రదించి పోర్టల్‌లో వివరాలు నమోదుచేయించాలి.

కౌలు రైతులు రైతు భరోసా లబ్ధి పొందడానికి కచ్చితంగా సీసీఆర్సీ కలిగి ఉండాలి. సాగుదారులు వ్యవసాయాధికారులను సంప్రదించి తమ వివరాలు సీసీఆర్సీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అర్హతను బట్టి మే 1నుంచి సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. వీరు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులను గుర్తిస్తారు. వారికి ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa