చనిపోతూ అవయవాల ధనం పెద్ద విషయమేమీ కాదు. కానీ బ్రెయిన్ డెడ్ అయి ఇస్తే. 13 ఏళ్ల బాలిక... తాను చనిపోతూ మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ముస్కాన్ గ్రోవర్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బతకడం కష్టమని తేలడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను ఇతరులకు డొనేట్ చేశారు. దాంతో ఆ అమ్మాయి గుండె, కాలేయం, మూత్ర పిండాలు ఇతర అవయవాలను ఆరుగురికి అమర్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ఇది జరిగింది. సోలన్ జిల్లాకు చెందిన ముస్కాన్ సైకిల్పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో బాలిక బ్రెయిన్కు తీవ్ర గాయం అయింది. ముందుగా ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. తర్వాత పీజీఐఎంఈఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముస్కాన్ బ్రెయిన్ డెడ్ గురైందని వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలిక అవయవాలను దానం చేయడం ద్వారా ఇతరులను రక్షించవచ్చని డాక్టర్లు బాలిక కుటుంబ సభ్యులకు చెప్పారు. దానికి వారు కూడా అంగీకరించారు. వారి అమ్మాయి మరణం వృథా కాకూడదనే ఉద్దేశంతో దు:ఖాన్ని గుండెల్లోనే దాచుకుని అవయవదానంతో వారి ఉదారతను చాటుకున్నారు.
ముస్కాన్ తమకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి అని, అవయవదానం అనేది చాలా కష్టతరమైన నిర్ణయమే కానీ, మంచి పని కావడంతో ఒప్పుకున్నామని బాలిక తల్లి సమృతి గ్రోవర్ చెప్పారు. సొంత బిడ్డ మరణం చాలా బాధాకరమైందని, అలాంటి సందర్భంలోనూ అపరచితుల ప్రాణాలను రక్షించాలని ఆలోచించడం చాలా గొప్ప విషయమని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరక్టర్ ప్రొఫెసర్ సుర్జిత్ సింగ్ అన్నారు. వారెంతోమందికి ఆదర్శమని, తాము వారికి రుణపడిపోయామని ఆయన అన్నారు. అదే విధంగా తక్కువ సమయంలో అవయవ మార్పిడికి సహకరించిన సిబ్బందిని ఆయన ప్రశంసించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బంది కేవలం రెండు రోజుల్లో శస్త్రచికిత్సల ద్వారా బాలిక అవయవదానాలను ఆరుగురి రోగులకు అమర్చారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు చెందిన 40 ఏళ్ల ఈశ్వర్ కుమార్ కూడా మార్చి 19న ఇలాగే బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. కిడ్నీ వ్యాధి కారణంగా ఆయన చనిపోయారు. అయితే ఈశ్వర్ కుటుంబ సభ్యులు కూడా అతని అవయవాలను డోనేట్ చేయడానికి ఒప్పుకున్నారు. దాంతో అతని గుండె, లివర్ ఇతర అవయవాలను ఇతరులకు అమర్చారు. అలాగే నంజన్గూడ్కు చెందిన సవిత అనే మహిళ అవయవాల ద్వారా కూడా ఐదుగురు రోగులను డాక్టర్లు రక్షించారు. ఆమె కూడా బ్రెయిన్ డెడ్కు గురైంది. రెండురోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించిన తర్వాత బతకడం కష్టమని డాక్టర్లు తేల్చారు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa