హిజాబ్ వివాదం ఇపుడు మరోకొత్త రమైన మత రాజకీయ రంగు పులుముకొంటోంది. కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదంపై అల్-ఖైదా చీఫ్ ఆయిమన్ అల్ జవహిరీ స్పందించిన ఓ వీడియో చర్చనీయాంశమవుతోంది. 9 నిమిషాల నిడివిగల ఈ వీడియోను అల్-ఖైదా మీడియా అస్-సహబ్లో విడుదల చేశారు. ఆందోళన సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నవారికి ఎదురుగా నిలబడి ‘అల్లాహు అక్బర్’ అంటూ నినాదం చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కాన్ను ప్రశంసించడం ఆ వీడియోలో ఉంది. ఆమె వీడియోను సోషల్ మీడియాలో చూశానంటూ పొగడ్తలు కురిపించాడు. ఆమెను సోదరిగా అభివర్ణించిన జవహిరీ..‘ది నోబెల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా’ అని ప్రశంసలు గుప్పించారు. జీహాద్ స్ఫూర్తిని ఆమె కొనసాగించిందని, ముస్లిం సమాజాన్ని మేల్కొల్పిందని కీర్తించాడు. అంతేకాదు, భారత్లోని ముస్లింలపై అక్కడి ప్రభుత్వం దౌర్జన్యకాండను ప్రయోగిస్తోందని ఆరోపించాడు. దీన్ని తిప్పికొట్టేందుకు దేశంలోని ముస్లింలంతా ఐక్యంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చాడు. మేధావులు మీడియానూ ఉపయోగించుకోవాలని, ఆయుధాలతోనూ కదనరంగంలోకి దూకాలని సూచించాడు.
‘వాస్తవాన్ని ముస్కాన్ వెలుగులోకి తెచ్చింది.. ముస్లింలు, బహుదైవారాధకులకు మధ్య శత్రుత్వాన్ని బట్టబయలు చేసింది.. భారత్లోని మోసపూరిత అన్యమత ప్రజాస్వామ్యాన్ని వెలుగులోకి తెచ్చినందుకు దేవుడు ఆమెకు తగిన ప్రతిఫలం ఇవ్వుగాక’ అని జవహరీ ఆ వీడియోలో చెప్పాడు. తనకు ప్రేరణ కలిగించిన ఆమెపై ఓ పద్యం కూడా రాశానని చెబుతూ దానిని చదివి వినిపించాడు. తన కానుకగా ఆ పద్యాన్ని ముస్కాన్ స్వీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హిజాబ్ వివాదంపై జవహరీ వీడియోతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భావోద్వేగ అంశాన్ని ఉగ్రవాద సంస్థలు వినియోగించుకుంటున్నాయని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అటు, జవహరీ వీడియోపై కర్ణాటకలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం సరికాదని కర్ణాటక మంత్రి అశ్వత్థనారాయణ ఘాటుగా బదులిచ్చారు.
జవహిరీ వీడియోపై ముస్కాన్ తండ్రి మొహమ్మద్ హుస్సేన్ ఖాన్ స్పందించారు. అసలు అతడు ఎవరో మాకు తెలియదని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలన్నారు. తమకు ఎవరి సాయమూ వద్దని, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వాలని ఆయన వేడుకున్నారు. జవహరీ తన కుమార్తెను ప్రశంసించడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా, ‘ఆ వీడియోలో అతనేదో అరబ్బీలో మాట్లాడాడు.. మనమంతా ఈ దేశంలో శాంతియుతంగా కలిసిమెలసి జీవిస్తున్నాం. మనలో విభేదాలు సృష్టించే ప్రయత్నమే ఇది’ అన్నారు. తాజా వీడియోతో అల్-ఖైదా చీఫ్ జవహిరీ 2020లో అనారోగ్యంతో చనిపోయాడంటూ వచ్చిన నివేదికల్లో నిజం లేదని తేలిపోయింది. అతడి మరణం గురించి ధ్రువీకరించని నివేదికల తర్వాత కూడా అనేక వీడియోలను విడుదల చేసింది. చారిత్రక వైరుధ్యాలు, సైద్ధాంతిక సమస్యల గురించి మాత్రమే ఈ వీడియోలో ప్రస్తావించారు. దీంతో ఆ వీడియోలు ఆయన చనిపోక ముందు చిత్రీకరించినవనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, హిజాబ్ వివాదంపై స్పందించడంతో బతికే ఉన్నాడనేది నిజం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa