ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫించన్ డబ్బుతో ఆలయాన్ని నిర్మించిన ముస్లిం వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 02:49 AM

దేశంలో మతం పేరుతో చిచ్చు రాజేస్తుంటే మరోవైపు మత సామరస్యం చాటే ఉద్దంతాలు కూడా మన ముందు కనిపిస్తున్నాయి. హిజాబ్ వివాదానికి కేంద్రంగా మారిన కర్ణాటకలో మతసామరస్యానికి ప్రతీకగా జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ ముస్లిం వ్యక్తి.. హిందూ దేవాలయాన్ని నిర్మించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. నాలుగేళ్ల క్రితం రెహ్మాన్ అనే వ్యక్తి చామరాజనగర్ జిల్లాలోని చిక్కహోళె రిజర్వాయర్ దగ్గర గణపతి ఆలయాన్ని నిర్మించారు. రిజర్వాయర్ దగ్గర గేట్ కీపర్‌గా పనిచేస్తున్న రెహ్మాన్ చేసిన ఈ పనిపై చాలామంది ప్రశంసలు కురిపించారు. అయితే రెహ్మాన్ మాత్రం దైవిక శక్తుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయని, దానిని మాత్రమే అమలు చేశానని అంటున్నారు.


తన పింఛన్‌ డబ్బుతో రెహ్మాన్ ఆలయాన్ని నిర్మించడమే కాదు. గుడిలో ఒక పూజారిని కూడా పెట్టి నెలకు రూ.4000ల జీతాన్ని అందిస్తున్నారు. అలాగే ప్రతి సోమవారం, శుక్రవారం పువ్వులను, పూజాసామాగ్రిని ఆలయంలో ఏర్పాటు చేసి, ఆ రెండు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు రెహ్మాన్ స్వయంగా ప్రసాదాన్ని అందిస్తారు. ఇది ప్రతివారం జరుగుతున్న తంతు.


అయితే కర్ణాటకలో ప్రస్తుతం చెలరేగుతున్న వివాదాలకు సంబంధించి ప్రశ్నిస్తే ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని రెహ్మాన్ అంటున్నారు. మనుషుల్లో తేడా అనేది ఏమన్న ఉంటే అది ఆడ, మగ అనే తేడా మాత్రమేనని ఆయన అన్నారు. అంతకు మించి ఎటువంటి భేదాలు లేవన్నారు. అందరిలోనూ ఒకటే రక్తం ఉందని, మరింకేం తేడాలు లేవని ఆయన అన్నారు. తాను ఆలయాన్ని నిర్మించి నాలుగేళ్లైంది. నిర్మాణం కోసం తన ఫించన్ డబ్బులు ఖర్చు చేశానని రెహ్మాన్ చెప్పారు.


" ఆలయం నిర్మించి నాలుగేళ్లు అయింది. దానికోసం నా పింఛన్ డబ్బును ఖర్చు చేశాను. దానిపై నా కుటుంబం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను హిందూ ఆలయాన్ని నిర్మించినందుకు నా మతానికి సంబంధించిన సభ్యులు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు" అని రెహ్మాన్ చెప్పారు. అంతేకాదు చిక్కహోళె ఆనకట్ట సమీపంలోని బండరాయిపై ఓ విగ్రహం చోరీకి గురైందని, దైవిక శక్తి సూచనల తర్వాత స్థానిక రుషులను సంప్రదించి గణేశుడి విగ్రహాన్ని తీసుకురావడానికి తమిళనాడు వెళ్లానిని రెహ్మాన్ అన్నారు.


ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మికతను అనుభవించానని రెహ్మాన్ అంటున్నారు. ఒక్కడే దేవుడు ... ఒక ముస్లింనైనా తాను ఆలయాన్ని నిర్మించినంత మాత్రాన ఆ వాస్తవం మారిపోదని, కానీ అకస్మాత్తుగా అలాంటి బేధాలు ఎలా వస్తున్నాయనేది తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అందరూ ఐక్యతతో ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa