రెండేళ్ల పాటు ప్రజలతో గడిపే అవకాశమొచ్చిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా ఉన్నందువల్ల మూడేళ్ల పాటు ప్రజలతో గడపలేకపోయానని... ఇప్పుడు రెండేళ్లు ప్రజలతో గడిపే అవకాశం వచ్చిందని అన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమవుతానని, గడప గడపకు వెళ్లే కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు.
సీఎం జగన్ తమకు దైవంతో సమానమని, ఆయన సైనికుడిగా పనిచేయడమే తమకు గౌరవమని అనిల్ అన్నారు. మంత్రి పదవి లేకున్నా తాము తగ్గబోమని అన్నారు. జగన్ ను మరోసారి సీఎంగా చేసుకుని, తాము మరోసారి మంత్రులు అవుతామని చెప్పారు. మంత్రి పదవులు దక్కని అసంతృప్తి... తండ్రి మీద కొడుకు పడే అలక వంటిదని అన్నారు. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు.
ప్రమాణస్వీకారానికి మంత్రి కాకాణి గోవర్ధన్ తనకు ఆహ్వానం పంపలేదని అన్నారు. అయితే, తన నియోజకవర్గంలోకి కాకాణిని ఆహ్వానిస్తానని చెప్పారు. వైసీపీ ఒక కుటుంబం వంటిదని... ఏవైనా గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి తనకు ఎంత గౌరవం ఇచ్చారో... ఇప్పుడు ఆయనకు అంతకంటే రెండు రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు.
మరోపక్క, జనసేనాని పవన్ కల్యాణ్ పై అనిల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేని పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదని... టీడీపీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చా నాయక్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ వద్ద 35 నుంచి 40 సీట్లు బిచ్చం అడుక్కునే ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు. పవన్ అభిమానులు తనను ఎంత ట్రోల్ చేసినా తాను భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa