ఎడతెరిపిలేని వర్షాలతో అసోం రాష్ట్రం వణికింది. అక్కడ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. పిడుగులు, ఉరుములతో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. 48 గంటలుగా కురుస్తోన్న వర్షాలకు అక్కడ ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు. అసోంలో గురువారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిబ్రూఘర్ జిల్లాలోని ఖేర్ని గ్రామంలో నలుగురు చనిపోయారు. టింగ్కాంగ్ రెవెన్యూ గ్రామంలో శుక్రవారం సాయంత్రం వర్షం వల్ల నలుగురు మృతి చెందారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దిబ్రూగఢ్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ వెల్లడించారు. బలమైన తుఫాన్ వల్ల ఆ ప్రాంతంలో చెట్లు కూడా నేలకొరిగినట్టు చెప్పారు.
అలాగే బార్పేట జిల్లాలో మరో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. గోల్పరా జిల్లాలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మరణించాడు. టిన్సుకియాలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ విషయాన్ని టిన్సుకియా అదనపు డిప్యూటీ కమిషనర్ దీపు కుమార్ దేకా వెల్లడించారు. అలాగే అక్కడ తుఫాన్ వల్ల చాలా ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని, దాంతో స్థానిక ప్రజలు పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారని ఆయన తెలిపారు. దీంతో ప్రజల కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
వర్షాల కారణంగా 592 గ్రామాల్లో 20వేల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వర్షాలకు చిరాంగ్, దర్రాంగ్, కాచర్, గోలాఘాట్, కర్బీ అంగ్లాంగ్, ఉదల్గురి, కమ్రూప్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు రెండు రోజుల్లో రాష్ట్రంలో కనీసం 7,378 ఇళ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. కాగా 2020లో కూడా వరదల వల్ల అసోం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రభావితం అయ్యారు. వర్షాలు, వరదల వల్ల పంట పొలాలు నాశనం అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa