సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చినట్టు కనిపించి కనువిందు చేశాయి. ఈ అరుదైన అద్భుత ఖగోళ దృశ్యం బుధవారం ఆవిష్కృతమైంది. సూర్యోదయానికి ముందు 3:49 గంటల నుంచి 5:06 గంటల మధ్య వరకూ (కుంభరాశి మధ్య) శని, అంగారక, శుక్ర, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించాయి. సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకడమిక్ రిసెర్చ్ క్యూబ్ (స్పార్క్) ఫౌండేషన్ అధ్యక్షుడు, వైట్ హ్యాట్ హ్యాకర్ ఎస్.సాయిసందీప్ ఆధ్వర్యంలో పలువురు శాస్త్రవేత్తలు టెలిస్కోప్, బైనాక్యులర్ సాయంతో ఈ అరుదైన గ్రహ చతుష్టయాన్ని వీక్షించే ప్రదర్శన నిర్వహించారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఏలేరు ప్రాజెక్టు సమీపంలో ఉన్న సాయిబాబా మెట్ట ఎత్తైన ప్రాంతం కావడంతో ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ముందుగా శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే వరుసలోకి రాగా కొంత సమయం గడచిన తర్వాత బృహస్పతి వచ్చి చేరిందని సందీప్ వెల్లడించారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి కక్ష్య మార్గంలో చోటు చేసుకునే మార్పులతో ఇలాంటి విశేషాలు జరుగుతుంటాయని ఆయన చెప్పారు. ప్రతి 20 ఏళ్లకొకసారి ఇవి దగ్గరగా వచ్చి ఒకే వరుసలో కనిపిస్తాయని అన్నారు. ఏప్రిల్ 23న ఈ నాలుగు గ్రహాల సరసన చంద్రుడు కూడా చేరనున్నాడని వెల్లడించారు.
కాగా.. ఈ దృశ్యాలను ఫోటోల్లో బంధించడం చాలా కష్టమని, ఈ గ్రహాలన్నీ భూమి నుంచి చూస్తే దగ్గరగా ఉన్నట్లు కనిపించినా వాటి మధ్య దూరం బిలియన్ కిలోమీటర్లు ఉంటుందని ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయిప్రదీప్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa