విద్యుత్ కోతలపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం తెనాలిలో రాత్రి నుండి తెల్లవారుజాము రెండున్నర వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే రూరల్ గ్రామాల్లో రాత్రి 7: 30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ నిలిచిపోయింది.
ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసించారు. పగలంతా ఎండ తీవ్రతతో విలవిలలాడిన ప్రజలు రాత్రివేళ సేద తీరే సమయంలో విద్యుత్ కోత ఏంటని ప్రశ్నిస్తున్నారు. వృద్ధులు చిన్నారులు అవస్థలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.
దీంతో పట్టణంలోని ప్రజలు చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు. విద్యుత్ కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కి చెందిన లారీ అద్దాలను పగలగొట్టారు.
అలాగే విద్యుత్ కార్యాలయానికి చెందిన అద్దాన్ని కూడా పగులగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల విద్యుత్ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో గృహ వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ కోతలు ఉండవని అధికారులు చెప్పారని, అయితే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa