తన సొంత దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులపై శ్రీలంకకు చెందిన ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే మండిపడ్డారు. ప్రభుత్వ మద్దతుతో ప్రజలపై గూండాలు దాడి చేస్తున్నారని ఆయన విమర్శిచాడు. ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం శాంతియుతంగా ప్రజలు నిరసనల్లో పాల్గొంటుంటే వారిపై శ్రీలంక ప్రభుత్వ మద్దతుతో గూండాలు దాడి చేస్తున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే అన్నారు.
ప్రభుత్వం పాల్పడుతోన్న చర్యలు చూస్తుంటే అసహ్యమేస్తోందని ట్వీట్ చేశారు. పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను కొందరు దుండగులు కొట్టారని తెలుపుతూ అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. నిన్న శాంతియుతంగా నిరసన చేసిన ప్రజలపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం సరికాదని అన్నారు.
ప్రజలపై జరుగుతోన్న హింస వెనుక ప్రభుత్వం ఉందని శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని చెప్పారు. అమాయక ప్రజలపై జరిగిన దాడి అనాగరిక చర్య అని లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ అన్నారు. శ్రీలంకను ఇటువంటి నాయకత్వం నడిపిస్తోందని విమర్శలు గుప్పించారు. దేశం కోసం తాను అందరి పక్షాన ఉంటానని చెప్పారు.
శాంతియుత నిరసనలు తెలుపుతోన్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ నిరోషన్ డిక్ వెల్లా చెప్పారు. కాగా, తాజాగా చోటు చేసుకున్న హింసలో ఐదుగురు మృతి చెందగా, దాదాపు 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని రోజుల క్రితం కూడా కొందరు క్రికెటర్లు తమ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa