వచ్చే ఎన్నికలను జీవర్మణ సమస్యగా తీసుకొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ వ్యూహాలపై సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అమలు చేయాల్సిన వ్యూహాల రచన కోసం రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా నవ సంకల్ప్ చింతన్ శిబిర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సదస్సులో తొలి రోజైన శుక్రవారమే బృంద చర్చలు మొదలైపోయాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం తర్వాత మధ్యాహ్నం కార్యక్రమానికి హాజరైన నేతలు ఆరు బృందాలుగా విడిపోయి చర్చల్లో మునిగిపోయారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులతో పాటు ఉపాధి, రైతుల సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన తదితర అంశాలపై ఈ చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే... బృంద చర్చలకు హాజరైన నేతలంతా తమ మొబైల్ ఫోన్లను తమకు కేటాయించిన గదుల్లోనే వదిలేసి భేటీలకు రావాల్సి వచ్చింది. చర్చల్లో ఆయా నేతలు వెల్లడించిన అభిప్రాయాలు, పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏ కోశాన కూడా బయటకు లీక్ కాకూడదన్న భావనతోనే ఈ మొబైల్ ఫోన్లు లేకుండా బృంద చర్చలకు రావాలంటూ నేతలకు పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదని, అందరూ తమ మొబైల్ ఫోన్లను వదిలేసిన తర్వాతే చర్చల్లో అడుగు పెట్టాలని పార్టీ స్పష్టంగా చెప్పడంతో నేతలంతా మొబైల్ ఫోన్లను పక్కన పెట్టేసి వచ్చారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా అందరు నేతల మాదిరే బృంద చర్చలలో పాలుపంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa