ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీలో ముస్లింలకు ప్రాతినిధ్యం శూన్యం...ఖాళీ అవుతున్న పదవులు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:40 AM

బీజేపీ అంటనే  యాంటి ముస్లిం అన్నది ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రభుత్వ పదవుల్లో సైతం ముస్లింల ప్రాతినిధ్యం నామ మాత్రమే. ఈ ప్రాతినిధ్యం కూడా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లోనూ త్వరలో బీజేపీకి ముస్లిం ఎంపీలు కనిబడని పరిస్థితి. ప్రస్తుతం అధికార పార్టీకి రాజ్యసభలో ముగ్గురు ముస్లిం ఎంపీలు ఉండగా లోక్‌సభలో ఒక్కరంటే ఒక్కరూ లేరు. పెద్దల సభలోని ఆ ముగ్గురు ప్రతినిధుల పదవీకాలం ముగియడం, వచ్చే ఎన్నికలకు ముస్లిం అభ్యర్థిని ఆ పార్టీ ప్రతిపాదించకపోవడంతో బీజేపీకి ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సయ్యద్ జాఫర్ ఇస్లామ్, ఎంజే అక్బర్‌ల పదవీకాలం త్వరలో ముగియనుండగా.. వీరిని తిరిగి నామినేట్ చేయలేదు. జూన్ 10న జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఏ ఒక్క ముస్లిం లేకపోవడం గమనార్హం.


ప్రస్తుతం మోదీ క్యాబినెట్‌లో మైనార్టీల వ్యవహార శాఖ మంత్రిగా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీకాలం జులై 7తో ముగియనుండగా.. ఆరు నెలల్లోపు ఆయన ఎన్నిక కాకుంటే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. బీజేపీ వర్గాల ప్రకారం యూపీలోని రాంపూర్ లోక్‌సభ ఉప-ఎన్నికల్లో అధిష్ఠానం నఖ్వీని పోటీకి నిలపనుందని తెలిపాయి. రాంపూర్ ఎంపీగా ఉన్నఎస్పీ నేత అజం ఖాన్ రాజీనామాతో అక్కడ ఉప-ఎన్నిక జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అజం ఖాన్ ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేశారు. ఈ స్థానానికి జూన్ 23న ఉప- ఎన్నిక జరగనుంది.


ఇక, ఎంజే అక్బర్ పదవీకాలం జూన్ 29తోనూ, ఇస్లామ్ జులై 4తో పదవీకాలం ముగియనుంది. రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ప్రస్తుతం ఈ కోటాలో ఏడు ఖాళీలు ఉండగా ఒక ప్రముఖ ముస్లిం నాయకుడిని ఎగువ సభకు నామినేట్ చేయడానికి ఈ మార్గం ద్వారా బీజేపీ ప్రయత్నించవచ్చు.


ఇక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. అయితే, వీరిలో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎన్‌డీఏలోనూ ఒక్క ముస్లిం ఎంపీ మాత్రమే ఉన్నారు. లోక్‌జనశక్తి ఎంపీ మెహబూబ్ అలీ కైజర్ బిహార్‌లోని ఖగారియా పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa