వేసవి కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల రసాలు కమ్మగా కనువిందు చేస్తాయి. వేసవి కాలంలో అత్యధికంగా లభించే సీజనల్ పండు మామిడి. ఏపీలో మామిడి పండ్లు పరక లేదా డజన్ల రూపంలో అమ్మకాలు సాగుతుంటాయి. పరక అయినా డజను అయినా గరిష్టంగా ఓ వెయ్యిరూపాయలు నుంచి రెండు వేల వరకు గరిష్ట ధర పలుకుతుంది. అంతకు మించి అయితే నూజివీడు ఎక్స్ పోర్ట్ క్వాలిటీ మామిడి పండ్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ ఏకంగా ఒక్కో మామిడి పండూ లక్షరూపాయలు పలకడం ఎక్కడైనా చూశామా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది.
కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఓ రైతు ఇంత భారీ రేటు పలికే మామిడి పండ్లను సాగుచేస్తున్నాడు. జపాన్ దేశానికి చెందిన 'మియాజాకీ' అనే జాతికి చెందిన మామిడిపండ్లు మన దేశంలో లక్షలరూపాయల్లో ధర పలుకుతోంది. దీంతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు తనకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఈ మియాజాకీ జాతికి చెందిన మామిడిపండ్లు పండిస్తున్నారు. ఈ మామిడి విత్తనాన్ని జపాన్ దేశంనుండి తీసుకొచ్చినట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు లోకల్ యాప్ కు తెలిపారు.
ఈ సీజన్ లో పంట చేతికి కూడా వచ్చిందని, ఈ మియాజాకీ రకం మామిడిపండులో పోషకవిలువలు చాలా అధికంగా ఉంటాయని, ఒక్కో పండు మూడునుంచి నాలుగొందల గ్రాముల బరువు ఉంటుందని, అందుకే ఈ మధురఫలానికి ప్రంపంచమార్కెట్లో కిలో రెండున్నర లక్షల రూపాయల వరకూ ధర ఉందని నాగేశ్వరరావు తెలిపారు. ఇవే కాకుండా తమకు ఉన్న నాలుగెకరాల పొలంలో ప్రపంచంలో ఉన్న వివిధరకాల మామిడిపండ్లను తాను, తన కుమారుడు కిశోర్ కలిసి, స్వయంగా పండిస్తున్నామన్నారు.
ఇందులో టెంకలేని మామిడి, యాపిల్ మామిడి, పలురకాల మామిడిపండ్లు, అలాగే.. తెల్ల నేరేడుపండు కూడా తమ పొలంలో పండిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని మామిడిరకాలు తన పొలంలో పండించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంత అరుదుగా లభించే, ఇంత భారీ ఎత్తున ధర పలికే మియాజాకీ మామిడి పండ్లను పండిస్తున్న రైతు ఓదూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వీటిని మాత్రం సాధారణ ప్రజలకు విక్రయించే పరిస్ధితి లేకపోవడంతో కేవలం వీఐపీలను మాత్రమే నమ్ముకున్నాడు. ఇంత ఖరీదైన మామిడిపండ్లను విక్రయించడానికైతే కాదని, వీఐపీలకు మాత్రమే అందిస్తానని మీడియాకు తెలియజేశారు. దీంతో కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వీఐపీలకు మాత్రమే ఈ అరుదైన మియాజాకీ మామిడి పండ్లు అందనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa