ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక విన్నపానికి...స్పందించిన భారత్...55 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ అందజేత

international |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 08:47 PM

శ్రీలంకలో వర్షకాల సీజన్ ‘యాలా’ ప్రారంభమైంది. విత్తనాలు నాటేందుకు సరిపడా యూరియా నిల్వలు కూడా ఆ దేశంలో లేవు. దీంతో అత్యవసర వినియోగానికి 65 వేల టన్నుల యూరియా కొనుగోలు కోసం శ్రీలంక ప్రభుత్వం భారత్‌ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఇండియా.. శ్రీలంకకు తక్షణమే రుణం రూపంలో యూరియా పంపేందుకు ముందుకొచ్చింది. 


ఆపద్కాలంలో భారత ప్రభుత్వం సాయం అందిస్తుండటం పట్ల శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. పొరుగు దేశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్న భారత్.. చిరకాల మిత్రుడు, భాగస్వామి అయిన శ్రీలంకకు గత కొద్దినెలలుగా అనేక విధాలు సాయం అందిస్తోందని శ్రీలంకలోని భారత హైకమిషన్ వెల్లడించింది.


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు మరో విడత సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. యూరియా కొనుగోలు కోసం పొరుగు దేశానికి 55 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ లైన్ అందించాలని భారత్ నిర్ణయించింది. అత్యవసరంగా సాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అర్థించడంతో భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ లైన్‌కు సంబంధించి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింగే, వ్యవసాయ మంత్రి మహీంద్ర అమరవీర, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే సమక్షంలో శ్రీలంక ప్రభుత్వం, ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలంబోలో ఒప్పందంపై సంతకాలు చేశాయి.


ఇదిలావుంటే   రసాయన ఎరువులును దిగుమతి చేసుకోకుండా సేంద్రీయ సాగు వైపు మళ్లాలని గతంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీలంకలో పంట దిగుబడులు 50 శాతం తగ్గాయి. ఫలితంగా ఆహార కొరత తలెత్తింది. సంక్షోభ సమయంలో లంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక తమ దేశ ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, ఇంధనం, మందులు, ఇతర నిత్యావసరాలను సమకూర్చలేపోతోంది. ఆ దేశంలో ఇంధన ధరలు, గ్యాస్ సిలిండ్ ధరలు భారీగా పెరిగాయి. మందులు, టాయిలెట్ పేపర్, అగ్గి పెట్టెలు కూడా లభ్యం కాని పరిస్థితి తలెత్తింది. 1948లో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కనీవిని ఎరగని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకు.. భారత్ ఇప్పటి వరకూ దాదాపు 3.5 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa