బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని వివిధ పార్టీలు ఏకమవుతున్నాయి. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి పూర్తిబలం లేని కారణంగా తమ అభ్యర్థి విజయం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని కమలనాథులపై పైచెయ్యి సాధించాలని బీజేపీ వ్యతిరేక పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇదిలావుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థికి ఓటు వేయవద్దని జనవాహిని పార్టీ డిమాండ్ చేసింది. జనవాహిని పార్టీ ఆధ్వర్యంలో నాన్ బీజేపీ ఫోర్స్ పేరున ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటెయ్యొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు ఎందుకు వేయకూడదో జనవాహిని అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వివరించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రం విడుదల చేశారు. బీజేపీ చరిత్ర అంతా మత, కుల కల్లోలేనని విమర్శించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు కూడా సొంత అవసరాలకు వాడుకొనే నీచ సంస్కృతి బీజేపీదని ఆరోపించారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ను ఇష్టానుసారంగా వాడుకొని రాజ్యసభ సభ్యుడిగా చేసిన చరిత్ర బీజేపీదని డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిని అర్ధరాత్రి నిద్రలేపి.. తెల్లవారు జామున సంతకాలు చేయించి, ఆ పదవికి గౌరవం లేకుండా చేసిందని బీజేపీపై దుమ్మెత్తిపోశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు అమ్మేస్తోందని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు విజ్ఞతతో ఆలోచించి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలని ప్రసాద్ బాబు పిలుపిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa