కేంద్రం తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలపై దేశంలోని యువత మండిపడుతోంది. అగ్నిపథ్ పథకంపై బీహార్లోని ముజఫర్పూర్, బక్సార్, బెగూసరాయ్ లో పలువురు యువకులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తామంతా ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకుని ఇతరులతో పోటీ పడాల్సి ఉంటుందన్నారు. నాలుగేళ్ల సర్వీసు కోసం తాము ఇంత కష్టపడాలా? అంటూ మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తనమను పిచ్చివాళ్లను చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్మెంట్ ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు.
అభ్యర్థుల నిరసనలతో బక్సర్లో రైల్వే ట్రాక్లు జామ్ అయ్యాయి. ముజఫర్పూర్లో కూడా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. టైర్లను తగులబెట్టారు. నియామక ప్రక్రియలో పెద్ద మార్పులను ప్రతిపాదించే కొత్త పథకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సాయుధ బలగాల శౌర్య పరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడవద్దని కోరారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాగా, పలువురు రాజకీయ నేతలు, సైనిక మాజీ అధికారులు కూడా కేంద్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు సూచనలు కూడా చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa