కేంద్ర తీసుకొస్తున్న అగ్నిపథ్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అగ్నిపథ్ పేరిట త్రివిధ దళాల్లో నియామకాల విషయంలో కేంద్రం నూతన విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది యువతకు సాయుధ బలగాల్లో పని చేసే అవకాశం కల్పించేలా కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఇదిలావుంటే ఈ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. అగ్నిపథ్ పథకంతో మన భద్రతా దళాల నిర్వహణా సామర్థ్యం తగ్గుతుందన్నారు. మన భద్రతా దళాల గౌరవం, సంప్రదాయాలు, క్రమశిక్షణ విషయంలో రాజీపడటాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా మానుకోవాలని రాహుల్ గాంధీ హితవు పలికారు.
అగ్నిపథ్ పథకంలో భాగంగా 17.5-21 ఏళ్ల మధ్య యువతను త్రివిధ దళాల్లోకి తీసుకుంటారు. వారికి ఆరు నెలల శిక్షణ అనంతరం నాలుగేళ్లపాటు పని చేసి రిటైరవుతారు. ఈ నాలుగేళ్లలో నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతంతోపాటు.. రూ.48 లక్షల వరకు జీవిత బీమా కల్పిస్తారు. సైనిక రాయితీలు, సదుపాయలను వీరికి సైతం కల్పిస్తారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన వారిలో 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత బయటకొస్తారు.. మిగతా 25 శాతం మందిని కొనసాగిస్తారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఏటా పెద్ద మొత్తంలో యువతకు సైన్యంలో చేరే అవకాశం లభించడంతోపాటు.. ప్రభుత్వానికి సైతం సైన్యం మీద చేసే వ్యయం తగ్గుతుంది. ఇదిలావుంటే ఈ పథకం అమలు చేయడం అంత ఈజీ కాదని కొందరు రిటైర్డ్ సైనికోద్యోగులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం భద్రతా బలగాలపై ప్రతికూలంగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అగ్నిపథ్లో ఎంపిక చేసిన వారిని రహస్య విధుల్లో నియమించగలమా..? గోప్యమైన పనులను వారితో చేయించగలమా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని విభాగాల్లో నైపుణ్యం సాధించడానికి 7-8 ఏళ్ల అనుభవం అవుతుందని.. కానీ ఈ విధానంలో క్యాడెట్ల నియామకానికే 180 రోజుల సమయం పడుతుందని మాజీ సైనికులు చెబుతున్నారు.
ఎలాంటి టెస్టింగ్ లేకుండా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టకుండా నేరుగా పథకాన్ని అమలు చేయడం సరికాదని.. ఇది సమాజంలో ఆయుధికీకరణకు దారి తీస్తుందని మాజీ సైనికాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏటా 40 వేల మందిలో 75 శాతం మంది సైన్యం నుంచి బయటకొస్తారు. వారికి ఉద్యోగం ఉండదు. కానీ ఆయుధాల వాడకంపై ఓ మాదిరి శిక్షణ ఉంటుంది. ఇది మంచి ఆలోచన కాదు.. దీని వల్ల ఎవరికీ లబ్ధి చేకూరదరని రిటైర్ట్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa