అగ్నిపథ్ పథకం వల్ల దేశానికి మంచే జరుగుతుంది తప్పించి ఎలాంటి కీడు జరిగే అవకాశమే లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన అగ్నిపథ్ పథకంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా సోమవారం మరోమారు స్పందించారు. అగ్నిపథ్ పథకం ఇప్పుడు రూపుదిద్దుకున్న పథకం కాదని పేర్కొన్న ఆయన... 1999లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ పథకానికి బీజం పడిందని చెప్పారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశానికి మంచే జరుగుతుంది తప్పించి ఎలాంటి కీడు జరిగే అవకాశమే లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అగ్నివీరులుగా ఒక్కసారి పనిచేస్తే.. యువకుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, తద్వారా సైన్యం నుంచి బయటకు వచ్చాక ఉద్యోగ, వ్యాపార రంగాల్లో యువత మెరుగ్గా రాణిస్తుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్పై అనవసర రాజకీయాలు చేయరాదని ఆయన పిలుపునిచ్చారు. భారత సైన్యంలో పనిచేయాలని చాలా మంది యువకులు భావిస్తున్నారని, అలాంటి వారంతా అగ్నివీరులుగా చేరవచ్చునని కిషన్ రెడ్డి చెప్పారు. అగ్నివీరులుగా పనిచేసిన తర్వాత యువతలో మెరుగైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పిన ఆయన... వాటి ద్వారా అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించే అవకాశం ఉందన్నారు. అగ్నివీరులందరికీ మహీంద్ర వంటి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కూడా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa