ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంటిలేటర్ పై ఉన్న చిత్ర పరిశ్రమ ఇపుడిపుడే ఊపిరి పీల్చుకుంటోంది: నటుడు నరేష్

national |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 04:53 PM

కరోనా కారణంగా వెంటిలేటర్ పై ఉన్న చిత్ర పరిశ్రమ ఇపుడిపుడే ఊపిరి పీల్చుకుంటోందని నటుడు నరేష్  పేర్కొన్నారు. ఈ సమయంలో సినీ కార్మికుల  సమ్మె సరికాదని ఆయన తెలిపారు. తనకు నిర్మాతలు, దర్శకులు, నటులు, కార్మికుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇలాగైతే మొత్తం మునిగిపోతామండీ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.  అయితే దాదాపుగా మూడేళ్లుగా కరోనా వల్ల సినీ రంగం కూడా తీవ్ర నష్టపోయి అట్టుగుకు పడిపోయిందని సీనియర్ తెలిపారు. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు పూట గడవక నానా ఇబ్బందుల పడ్డారని, వైద్య ఖర్చులు కూడా లేకుండా ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయని నరేశ్ వివరించారు. 


టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడంపై నటుడు నరేశ్ స్పందించారు. ఒకట్రెండు యూనియన్లకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని వెల్లడించారు. వేతనాలు పెంచకపోతే షూటింగులు ఆపేస్తామని పోరాటం చేస్తున్నారని తెలిపారు. డిమాండ్ల కోసం పోరాడడం మంచిదేనని, దీనిపై ఇండస్ట్రీలో పెద్దలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. 


ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, వెంటిలేటర్ పై ఉన్న చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటోందని, సినిమాలు విడుదలవుతున్నాయని వివరించారు. తెలుగు సినిమాకు మంచి పేరొస్తోందని, బ్యాంకులు నిండకపోయినా, కంచాలు నిండుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆకస్మిక సమ్మెకు దిగడం సరికాదని నరేశ్ అభిప్రాయపడ్డారు. 


"ఇండస్ట్రీ బిడ్డగా చెప్పేదొక్కటే. కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి చిత్ర నిర్మాతలు వడ్డీలు కూడా కట్టలేక కోట్లల్లో నష్టపోయారు. ప్రస్తుతం సినిమా నిర్మాణం ఊపందుకుంటోంది. ఈ సమయంలో తొందరపడకుండా, వారం పది రోజుల సమయం తీసుకుని, ఇటు ఫెడరేషన్ కి, ఇటు నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం చర్చించి ఓ పరిష్కారానికి రావడం కష్టమేమీ కాదు. సినీ పరిశ్రమను మళ్లీ అంధకారంలోకి వెళ్లనివ్వకుండా, షూటింగులు ముందుకు సాగేలా అందరం ఓ అవగాహనకు వద్దాం" అంటూ నరేశ్ సోషల్ మీడియాలో వీడియో సందేశం వెలువరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa