రోప్వే కేబుల్ కారు అర్థంతరంగా మధ్యలో ఆగిపోతున్న ఘటనలు పరిపాటిగా మారాయి. ఈ సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం నజర్ పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లోని రోప్వే కేబుల్ కారు గాలిలో చిక్కుకుపోయిన మరో ఘటన చోటుచేసుకుంది. టెహ్రీ జిల్లాలోని సుర్కందా దేవి టెంపుల్ రోప్వే కేబుల్ కారు నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. దాంతో అందులో బీజేపీ ఎమ్మెల్యేతో సహా కనీసం 60 మంది వ్యక్తులు 45 నిమిషాల పాటు ఉండిపోయారు. ట్రాలీలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని తెహ్రీ గర్వాల్ ఎస్ఎస్పీ నవనీత్ భుల్లర్ చెప్పారు.
అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పర్యాటకులను క్షేమంగా కిందకు దించారు. అనంతరం రోప్వే సజావుగా సాగుతుందని ఎస్ఎస్పీ నవనీత్ భుల్లర్ తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రోప్వే గాలిలో చిక్కుకోవడం చాలా తీవ్రమైన సమస్య అని అన్నారు. "మేము ఎవరి ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేం. నేను రోప్వే ఆపరేటర్లు సంబంధిత అధికారులతో చర్చిస్తాను" అని ఆయన అన్నారు. అటువంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
గతంలో జార్కండ్లోని డియోఘర్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పుడు కనీసం 15 మంది కేబుల్ కారులో చిక్కుకుపోయారు. తర్వా త వారిని 40 గంటల్లో రక్షించి బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మే నెలలో మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలోని మైహర్ పట్టణంలోని కొండపై ఉన్న దేవత శారదా ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన యాత్రికులు కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. గంట తర్వాత వారిని అధికారులు కాపాడారు. జూన్ నెలలో హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో పర్వానూ టింబర్ ట్రైల్ వద్ద కేబుల్ కారు గాలిలో చిక్కుకోవడంతో 11 మంది గంటల తరబడి చిక్కుకుపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa