సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇంటా విషాదం నెలకొంది. ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యల కారణంగా సాధనను హాస్పిటల్కు తీసుకెళ్లగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించనప్పటికీ ఫలితం లేకపోయింది.
సాధన మరణించిన సమయంలో ములాయం పక్కనే ఉన్నారు. గతంలో అనారోగ్యం బారిన పడిన ములాయం సైతం ఇదే హాస్పిటల్లో చికిత్స పొందారు. ములాయం కంటే ముందు సాధన ఫరూకాబాద్కు చెందిన చంద్రపకాశ్ గుప్తాను పెళ్లాడారు. కానీ కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి ఓ కుమారుడు జన్మించాడు.
ములాయం మొదటి భార్య మాలతీ దేవి 2003లో చనిపోయాక.. అదే ఏడాది ఆయన సాధనను వివాహం చేసుకున్నారు. సాధనా గుప్తా ములాయం కంటే 20 ఏళ్లు చిన్నవారు. ఆమె కుమారుడు ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఆయన భార్య అపర్ణా యాదవ్ బీజేపీలో కొనసాగుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అపర్ణ కాషాయ పార్టీ గూటికి చేరారు. సాధన మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలిపారు. అఖిలేష్ యాదవ్ ములాయం మొదటి భార్య కుమారుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa