ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెదిరింపులకు దిగిన లోన్ యాప్ నిర్వాహకుల అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:58 PM

బెదిరింపులు, తిట్టపురణం, అసభ్యమెసేజ్ లతో అప్పుతీసుకొన్నవారిని వేధిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలే కాదు.. ప్రముఖులకూ ఈ వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పీఏకు లోన్ యాప్ ఏజెంట్ల నుంచి కాల్స్ వచ్చాయి. లోన్ ఈఎంఐ చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.


ఈ నెల 25న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పీఏకు కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్‌ల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పర్సనల్ అసిస్టెంట్ శంకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడారు.. గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఒక మహిళ కాల్ చేశారు. 'మీరు లోన్ తీసుకున్నారని.. కట్టకపోతే మీ పిల్లలను చంపేస్తామని' బెదిరించారు. డబ్బులు బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నించారు. అసభ్యంగా మాట్లాడడంతో శంకర్ రూ. 25 వేలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తిరిగి మళ్ళీ, మళ్ళీ కాల్స్ చేసి వేధిస్తుండడంతో నేరుగా జిల్లా ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేయగా.. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


పోలీసులు రంగంలోకి దిగి చెన్నై వెళ్లి దర్యాప్తు చేశారు. సదరు కోల్‌మన్ కంపెనీలో సాంకేతిక ఆధారాలను సేకరించి.. మేనేజర్ మామిడిపూడి గురు ప్రసాద్, శివనాసన్ మహేంద్రన్, టీం లీడర్ మాధురి, నెల్లూరులోని ఫైనాన్స్ కంపెనీ రికవరీ మేనేజర్ పెంచలరావుని అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన ల్యాప్ టాప్ , మొబైల్స్ సీజ్ చేశారు. రూ.10వేల కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని 'కోల్ మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వివిధ బ్యాంక్‌లకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పని చేస్తుంది.


నెల్లూరు రామలింగాపురంలోని ఫుల్ ట్రాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రూ.8లక్షల 50వేలు లోన్ తీసుకున్న పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ తీసుకుని.. ఆ రుణం తీర్చక పోవడంతో.. అశోక్ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి యాప్ నిర్వాహకులు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. ఇటువంటివారు బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa