‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 15న రైల్వే అతిపెద్ద రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి ‘సూపర్ వాసుకి’ అని పేరు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తోపాటు, ఆగ్నేయ మధ్య రైల్వే అధికారులు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
సూపర్ వాసుకి గూడ్స్ రైలు పొడవు ఏకంగా 3.5 కిలోమీటర్లు. 295 వ్యాగన్లు ఉన్న ఈ రైలుకు ఆరు ఇంజన్లను అమర్చారు. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ నుంచి కోర్బా వరకు దీనిని నడిపారు. ఈ రైలులో ఏకంగా 27 వేల టన్నుల బొగ్గును ఒకేసారి తరలించారు.
ఒకే ట్రెయిన్ లో ఇంత భారీగా సరుకు రవాణా చేయడం రైల్వేల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ బొగ్గుతో 3 వేల మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఒకరోజంతా నడపవచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో వాసుకి, త్రిశూల్ పేర్లతో అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపినా.. వాటి పొడవు 2.8 కిలోమీటర్లలోపే ఉండటం గమనార్హం. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించడం, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ బొగ్గు సరఫరా కోసం ఇలాంటి పొడవైన రైళ్లను వినియోగిస్తున్నారు.రెండు, మూడు రైళ్లకు బదులు ఒకే రైలును నడపడం వల్ల రైల్వే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa