రెండు దశాబ్దాల తర్వాత రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో కనిపించారు. అయితే, ఆ సినిమా సమయంలో తనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయని, వాటిని చేసిన వారు ఇప్పుడు తనకు క్షమాపణ చెప్పరని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నప్పుడు తనపై కొందరు విమర్శలు చేశారని రేణూ గుర్తుచేసుకున్నారు. "కమ్బ్యాక్ ఇచ్చింది కాబట్టి ఇకపై అన్ని రకాల సినిమాల్లో నటిస్తుందని, ఎక్కడ చూసినా తనే కనిపిస్తుందని రాశారు. కానీ ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకు నేను మరే సినిమాలోనూ నటించలేదు, ఏ ప్రాజెక్టుకూ సంతకం చేయలేదు. నేను సినిమాలు అంగీకరించలేదని తెలిసి కూడా, నాడు విమర్శించిన వారు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరు కదా మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడతారు" అని ఆమె అన్నారు.నటన అంటే తనకు చాలా ఇష్టమని, కానీ అదే తన జీవిత లక్ష్యం కాదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. "నేను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపిస్తానేమో. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తాను కానీ, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వను. ఒకవేళ నటననే కెరీర్గా కొనసాగించి ఉంటే ఇప్పటికి మంచి పేరు సంపాదించేదాన్ని" అని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం తనకు మంచి పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయని రేణూ తెలిపారు. త్వరలోనే ఓ కామెడీ చిత్రంలో అత్త పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. అత్తాకోడళ్ల మధ్య హాస్యభరితంగా సాగే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. తనకు ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఎక్కువని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa