ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ వేణుమాధవ్ మృతి పట్ల స్పందిస్తున్నారు. ఆయనతో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన మృతి బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత 19 రోజులుగా సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం 12.21 గంటలకు కన్నుమూశారు. గతకొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణమాధవ్కు కిడ్నీలు కూడా చెడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వేణుమాధవ్ వయసు 51 సంవత్సరాలు. 1968 సెప్టెంబర్ 28న అప్పటి నల్గొండ జిల్లా కోదాడలో వేణుమాధవ్ జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్టు నుంచి సినిమాల్లో కమెడియన్గా అంచెలంచెలుగా ఎదిగారు. కింది స్థాయి నుంచి వచ్చి మంచి హాస్యనటుడిగా పేరుతెచ్చుకున్న వేణుమాధవ్కు ఇండస్ట్రీలో ప్రముఖలందరితోనూ మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా అలీ, ఉత్తేజ్, శివాజీరాజాలకు వేణుమాధవ్ మంచి స్నేహితుడు. అయితే, వేణుమాధవ్ మృతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇతర టాలీవుడ్ హీరోలు, నటులు, దర్శకులు ట్విట్టర్ ద్వారా వేణుమాధవ్కు నివాళి అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్బాబు, నేచురల్ స్టార్ నాని, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, నితిన్, మంచు మనోజ్, ఇలియానా, బెల్లంకొండ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి, బ్రహ్మాజి తదితరులు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa