జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్లంతా ఓ ఫ్యామిలీ భజన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ షో చూస్తున్నా ఒక్క ఫ్యామిలీనే హైలైట్ చేయడం ఏంటని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలలో ఏ స్కిట్ చూసినా మెగా ఫ్యామిలీ భజన చేస్తున్నట్లే ఉందని అంటున్నారు. హైపర్ ఆది దగ్గరి నుంచి సుడిగాలి సుధీర్.. ఇతర టీమ్లన్నీ చిరంజీవి ఫ్యామిలీ భజనే చేస్తున్నాయని, దీంతో.. ఒక్కోసారి ఆ స్కిట్లు చూడాలంటేనే విరక్తి పుడుతోందని వెల్లడిస్తున్నారు. అందరిలో హైపర్ ఆది భజనకు హద్దు, అదుపు లేకుండా పోతోందని చెబుతున్నారు. ఆ మధ్య గబ్బర్ సింగ్.. ఆ తర్వాత గద్దలకొండ గణేష్.. మొన్నటికి మొన్న సైరా నరసింహా రెడ్డి.. ఇలా ప్రతి స్కిట్లో చిరంజీవి లేదా ఇతర మెగా హీరోల పాత్రలు వేస్తున్నాడని అంటున్నారు. ఇక, కొందరైతే.. జబర్దస్త్ నిర్వాహక సంస్థ మల్లెమాల ప్రొడక్షన్స్ మెగా ఫ్యామిలీకి అమ్ముడుపోయిందా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ అనేది కామెడీ షో.. షో మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నవ్వులే నవ్వులు. ఈ కార్యక్రమంలోని ప్రతీ ఒక్క టీమ్ అద్భుత కామెడీతో, పంచ్లతో ప్రేక్షకులకు కావాల్సినంత నవ్వుల విందును అందజేస్తాయి. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షోకు అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానులే. అయితే, ఒక్క ఫ్యామిలీని మాత్రమే హైలైట్ చేస్తూ, డబ్బా కొడుతూ స్కిట్లు చేయడం వల్ల చిరాకు వస్తోందని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ షోకు మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తుండటం వల్లే ఆర్టిస్టులు మెగా భజన చేస్తున్నారని, స్కిట్ పూర్తయ్యాక తక్కువ మార్కులు వేయడం, రెమ్యునరేషన్లో కోత విధించడం లాంటి కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుందేమోనని కూడా కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa