పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా యూనివర్సిటీలో జరిగిన హింసాత్మక సంఘటనల దరిమిలా దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు పాకిన నిరసనలు బాలీవుడ్ను రెండుగా చీల్చాయి. విద్యార్థులపై పోలీసుల దమనకాండను బాలీవుడ్లో కొందరు ప్రముఖులు తీవ్రంగా ఖండించగా స్టార్లుగా చెలామణి అవుతున్న కొందరి మౌనం కూడా వివాదాస్పదమవుతోంది. నటులు ఆయుష్మాన్ ఖురానా, రాజ్కుమార్ రావు, పరిణితి చోప్రా, తాప్సీ పన్ను, మనోజ్ బాజ్పాయి, కొంకణా సేన్శర్మతోపాటు దర్శకులు అనురాగ్ కాశ్యప్, మహేశ్ భట్, సుధీర్ మిశ్రా తదితరులు సోషల్ మీడియా వేదికగా విద్యార్థులపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండించారు.
విద్యార్థులు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులపై తాను తీవ్రంగా ఆందోళన చెందినట్లు ఆయుష్మాన్ ఖురానా పేర్కొన్నారు. అయితే నిరసనలు హింసాత్మకం కారాదని, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి నిరసనలు దారితీయకూడదని ఆయన చెప్పారు. నటుడు రాజ్కుమార్ రావు కూడా ఒక ట్వీట్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది చాలా దూరం పోయింది..ఇక మౌనంగా ఉండలేను. ఇది ఫాసిస్టు ప్రభుత్వం అని స్పష్టమైపోయింది..స్పందించాల్సిన నోళ్లు మూతపడడం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది అని అనురాగ్ కాశ్యప్ ట్వీట్ చేశారు. కాగా, నటుడు రితేష్ దేశ్ముఖ్ తాను నిరసన తెలియచేస్తున్న విద్యార్థులకు అండగా నిలబడతానని చెప్పారు. అయితే తాను హింసను బలపరచలేనని ఆయన స్పష్టం చేశారు. నటి రిచా ఛద్దా కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ తాను జామియా మిలియా చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ పోలీసుల దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
కాగా, జమ్మూ కశ్మీరులో ఆంక్షలకు నిరసనగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఎఎస్)కు రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్ జామియా విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసించారు. దీనిపై షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన ట్వీట్ చేశారు. రచయిత అరుణి కాశ్యప్ ఈ సందర్భంగా ప్రధాని మోడీతో బాలీవుడ్ తారలు తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ప్రధాన మంత్రి స్నేహితులైన వీరంతా బాక్సాఫీస్ కలెక్షన్లకు భయపడకుండా స్పందించాల్సిన అవసరం ఉందని రణ్వీర్ సింగ్, కరణ్జోహార్ తదితర నటులను ఉద్దేశించి ఆయన పిలుపు ఇచ్చారు. దక్షిణాది సూపర్స్టార్, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా జామియా విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరో సూపర్స్టార్ రజనీకాంత్ మాత్రం ఇంకా స్పందించలేదు. మరో ప్రముఖ నటుడు సిద్ధార్థ్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను దుర్యోధన, శకునిగా అభివర్ణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa