దర్శకుడు సందీప్ వంగా 'యానిమల్' సినిమా విజయంతో తన తదుపరి సినిమా మీద పూర్తి దృష్టి పెట్టారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఇరగదీసింది అనే చెప్పాలి. రణబీర్ కపూర్ కెరీర్ లో ఈ 'యానిమల్' ఘన విజయం సాధించిన సినిమాగా చెప్పొచ్చు. రష్మిక పేరు ప్రపంచం అంతా మారుమోగిపోయింది ఈ సినిమాతో. అలాగే సందీప్ వంగా ఎక్కడికి వెళ్లినా అందరూ అతన్ని ప్రత్యేక గౌరవంతో చూస్తున్నారు ఈ సినిమా విజయంతో. అందరి దృష్టి ఇప్పుడు సందీప్ వంగా చెయ్యబోయే తదుపరి సినిమా మీదే వుంది. అతను ప్రభాస్ తో 'స్పిరిట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా వుండబోతోంది, ఇదొక హర్రర్ సినిమా అని, కాదు ఇది కూడా 'యానిమల్' లా ఒక హింసాత్మకమైన సినిమాగా ఉంటుందని, ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు ఈ సినిమా కథ గురించి ఆలోచించడం మొదలెట్టారు. అయితే సందీప్ ఒక సినిమా ఫంక్షన్ ని వచ్చినప్పుడు ఈ 'స్పిరిట్' కథా నేపధ్యం గురించి కొంచెం బయటపెట్టారు. 'అందరూ అనుకుంటున్నట్టు 'స్పిరిట్' హారర్ సినిమా కాదని, ఇది ఒక నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ కథ' అని చెప్పారు సందీప్. అతను ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్నాను అని చెప్పారు. ఒక నిజాయితీ గల పోలీసాఫీసర్ ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాలు ఈ సినిమాలో చూడచ్చు అని అంటున్నారు. అలాగే ప్రభాస్ కూడా మొదటిసారి పోలీస్ యూనిఫామ్ ఈ సినిమా కోసం ధరించనున్నారు. ఇందులో ప్రభాస్ ని ఇంతకుముందు చూడని ఒక కొత్త పాత్రలో సందీప్ చూపించనున్నాడని అన్నారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా 'కల్కి 2898' మే నెలలో సినిమా విడుదలకి సిద్ధంగా వుంది. అలాగే మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' అనే సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇది హర్రర్ కామెడీ అని అంటున్నారు. 'కల్కి 2898' సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా. ఇప్పుడు ఈ 'స్పిరిట్' పోలీసాఫిసర్ పాత్ర అని చెప్పారు సందీప్. వైవిధ్యమైన పాత్రలతో ప్రభాస్ ఇక ప్రేక్షకులని అలరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa