మంచు విష్ణు కథానాయకుడిగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విశేషాలను విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో సినిమా బడ్జెట్, చిత్రీకరణలో జాప్యం, ప్రభాస్ పాత్ర ప్రాముఖ్యత వంటి పలు అంశాలపై ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.2014లో తనికెళ్ల భరణి చెప్పిన 'కన్నప్ప' కథాంశం తనను ఎంతగానో ఆకట్టుకుందని విష్ణు తెలిపారు. "ఆ ఐడియాని విదేశీ నిపుణులతో కలిసి అభివృద్ధి చేశాను. నా ఆసక్తిని గమనించిన భరణి గారు, ఈ కథను భారీ స్థాయిలో తీయమని సూచించారు. ఆ తర్వాత నా ఆలోచనలకు అనుగుణంగా కథను సిద్ధం చేయించా. మొదట రూ.100 కోట్ల లోపే బడ్జెట్ అవుతుందని అంచనా వేశాం. కానీ, తీరా చూస్తే ఖర్చు రెట్టింపు అయింది" అని విష్ణు వివరించారు.'మహాభారత్' వంటి దృశ్యకావ్యాన్ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ అయితే ఈ సినిమాకు న్యాయం చేయగలరని తన తండ్రి మోహన్ బాబు సూచించారని ఆయన గుర్తుచేసుకున్నారు. "శివుడి ఆశీస్సులు, నాన్నగారి ప్రోత్సాహంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో అండగా నిలిచారు" అని విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సినిమా విషయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి ప్రభాస్ అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని విష్ణు అన్నారు. "ప్రభాస్ పోషించిన విభిన్న పాత్రల్లో 'కన్నప్ప'లోని రుద్ర పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సినిమాలో నాన్నగారికి, ప్రభాస్కి మధ్య ఓ కీలక సన్నివేశం ఉంది. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కొత్త ప్రతిభను ప్రోత్సహించడం తనకిష్టమని చెప్పిన విష్ణు, 'కన్నప్ప' విషయంలో వీఎఫ్ఎక్స్ కోసం సరైన నైపుణ్యం లేని వ్యక్తిని తీసుకోవడమే తాను చేసిన పెద్ద తప్పని అంగీకరించారు. "వీఎఫ్ఎక్స్ పనుల వల్లే సినిమా కొంత ఆలస్యమైంది. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు మా బృందం అహర్నిశలు శ్రమిస్తోంది" అని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa