మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మేరకు శనివారం నాడు చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది. మోహన్ బాబు మాట్లాడుతూ "ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మా టైంలో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘కన్నప్ప’ సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమాను తీశామనిపిస్తుంది. అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఇక్కడి వరకు రాగలిగాం. వినయ్ లేకపోతే కన్నప్ప చిత్రం ఉండేది కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు" అని అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ "మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియన్స్కు థాంక్స్" అని అన్నారు.ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు. ఇంకా సినిమాను చూడాల్సినవాళ్లు చాలా మంది ఉన్నారు. అందరూ ఈ మూవీని చూడండి. మోహన్ బాబు గారు, విష్ణు గారు పదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతూ వచ్చారు. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ మూవీకి పని చేశారు. అందరికీ ధన్యవాదాలు" అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa