చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇప్పుడు అవార్డుల వేదికలపై తన సత్తా చాటుతోంది. దుబాయ్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2025 వేడుకలో ఈ సినిమా రెండు కీలక పురస్కారాలను కైవసం చేసుకుంది. ఈ చిత్రంతో నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల ‘ఉత్తమ నూతన నిర్మాత’గా అవార్డు అందుకోగా, హీరోగా నటించిన సందీప్ సరోజ్ ‘ఉత్తమ నూతన నటుడు’గా ఎంపికయ్యాడు.గత ఏడాది ఆగస్టు 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, కమర్షియల్గా ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస అవార్డులతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. సైమా పురస్కారాలతో తొలి ఫీచర్ ఫిల్మ్ నిర్మాతగా నిహారిక కొణిదెల తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి పలు గౌరవాలు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే, దర్శకుడు యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. దీనితో పాటు గామా అవార్డుల్లోనూ నిహారిక (ఉత్తమ నూతన నిర్మాత), యదు వంశీ (ఉత్తమ నూతన దర్శకుడు) పురస్కారాలు గెలుచుకోవడం విశేషం.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ.9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా మొత్తంగా రూ.24.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa