ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునసాగర్: తాగునీటి ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. వణికిపోతున్న గ్రామస్థులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:12 PM

గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నాయి. ఆకలి కేకలతో కనిపించినవారిని కరుస్తూ గ్రామాల్లో నానా హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండిపోతుండటంతో దాహం తీర్చుకునేందుకు నీళ్ల ట్యాంకులోకి దిగిన కోతులు.. తిరిగి పైకి ఎక్కలేక అందులోనే పడి 30 కోతులు చనిపోయాయి. అయితే ఆ ట్యాంకు నుంచే గ్రామంలోని మొత్తం 200 ఇళ్లకు తాగునీరు అందుతుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీ గ్రామంలో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.


హిల్‌ కాలనీలోని విజయవిహార్ సమీపంలో ఉన్న ఓ భారీ నీటి ట్యాంకులో పడి ఆ కోతులు మరణించాయి. అయితే అక్కడ ఉన్న 200 ఇళ్లకు తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు ఆ ట్యాంకును నిర్మించారు. కానీ ఆ ట్యాంకు పైభాగాన్ని మూసివేయకుండా కేవలం రేకులతో కప్పి ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక దాహం తీర్చుకునేందుకు ఆ ట్యాంకు వద్దకు కోతులు వెళ్లాయి. ట్యాంకులోని నీళ్లు తాగేందుకు ప్రయత్నించి ఆ రేకులను పక్కకు జరిపి మరీ 30 కోతులు అందులోకి దిగాయి. నీరు తాగిన తర్వాత ఆ కోతులు బయటికి వచ్చేందుకు మార్గం కనిపించలేదు. తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. పైకి రాలేక అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డాయి.


అయితే ఈ విషయాన్ని అధికారులు బుధవారం గుర్తించారు. వెంటనే ఆ ట్యాంకు పైన ఉన్న రేకులను తొలగించి చూడగా.. అందులోని నీటిలో కోతులు చనిపోయి ఉన్నాయి. దీంతో ఆ ట్యాంకు నుంచి 30 కోతుల మృతదేహాలను బయటికి తీశారు. ఇక కోతులు నీళ్ల ట్యాంకులోపడి చనిపోయిన ఘటన తెలిసి ఆ గ్రామస్థులు భయపడుతున్నారు. ఆ కోతులు చనిపోయి దాదాపు 10 రోజులు దాటి ఉంటుందని.. అప్పటి నుంచి తాము అవే నీటినే తాగుతున్నామని పేర్కొన్నారు. అయితే కోతులు చనిపోయి ఉన్న నీటిని తాగితే తమకు ఏమైనా అవుతుందేమోనని ఆ గ్రామస్థులు తీవ్రంగా వణికిపోతున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో అని భయపడిపోతున్నారు. నీళ్ల ట్యాంకులను ప్రతి 6 నెలలకు ఒకసారి శుభ్రం చేయాలని.. కానీ అధికారులు మాత్రం ఆ ట్యాంకును ఏ రోజు కూడా శుభ్రం చేయలేదని గ్రామస్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘఠనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa