బీఆర్ఎస్ పార్టీ నేత, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కు పోలీసులు షాకిచ్చారు. నియోజకవర్గంలో ఆయన ఇంటిని సీజ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో భగత్కు ఇచ్చిన ఇంటిని మంగళవారం రాత్రి ఖాళీ చేయించారు. కాగా ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న భగత్.. విషయం తెలుసుకొని హుటాహుటిన సాగర్ బయల్దేరారు. హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్కడకు వెళ్లటానికి వీళ్లేదన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే భగత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని.. తనకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి ఖాళీ చేయమేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. కాంగ్రెస్ అధికార బలంతో.. తనపై కేసులు పెట్టే ఆలోచన చేస్తుందని.. మాజీ మంత్రి జానా రెడ్డి కక్షసాదింపు చర్యలు చేస్తున్నారని భగత్ ఆరోపించారు.
భగత్ సాగర్ వెళితే.. అల్లర్లు జరిగే అవకాశం ఉందని.. ముందస్తు చర్యల్లో భాగంగా హాలియా వద్ద అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు. ఇక ఇళ్లు ఖాళీ చేయించటంపై స్పందిస్తూ.. ఐదు రోజుల క్రితమే భగత్కు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎన్నెస్పీకి చెందిన ఈఈ 19 నివాస గృహాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరు మీద అలాట్మెంట్ చేశారని, ఎమ్మెల్యే మారడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కు పలుమార్లు నోటీసులు ఇచ్చామన్నారు. దానికి ఆయన స్పందించకపోవడంతో కలెక్టర్ ఆదేశాలనుసారం ఇంటిని సీజ్ చేశామని తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa