ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగుల పేరిట 199 కరెంట్ ఖాతాలు తెరిపించి సైబర్ నేరగాళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 07:17 AM

అమాయకుల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వాటిని విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని ‘అద్దె ఖాతాల’ దందా సాగిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఈ వ్యవహారంలో అంతర్జాతీయ లింకులు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.ఈ ముఠా బాధితులకు నగదు ఆశ చూపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తుంది. అలా విజయవాడకు చెందిన దేవదాసు అనే నిరుద్యోగి పేరుతో ఖాతా తెరిపించి, అతనికి కేవలం రూ. 7 వేలు ఇచ్చారు. అయితే, ఇటీవల తన ఖాతాను తనిఖీ చేసుకున్న దేవదాసు అందులో ఏకంగా రూ. 2 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ ముఠా సేకరించిన బ్యాంక్ కిట్‌లను పార్వతి అనే మహిళ ద్వారా ఫిలిప్పీన్స్‌లోని ప్రధాన సూత్రధారులకు చేరవేసేవారు. అక్కడి నుంచే బెట్టింగ్‌లు, సైబర్ మోసాలకు సంబంధించిన సొమ్మును ఈ ఖాతాల్లోకి మళ్లించేవారు. ప్రతి ఖాతాపై ఈ ముఠాకు రూ. 30 వేల వరకు కమీషన్ అందేది. ఏపీతో పాటు తెలంగాణ, బెంగాల్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో జరిగిన మోసాలకు ఈ ఖాతాలనే వాడినట్లు పోలీసులు గుర్తించారు.ముఠా నాయకుడు సూర్య గతంలోనే ఆగ్రాలో ఇలాంటి కేసులోనే జైలుకు వెళ్లి వచ్చాడు. విడుదలయ్యాక మళ్లీ టెలిగ్రామ్ ద్వారా ఈ దందాను విస్తరించాడు. నిందితుడి కారుపై ఏకంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ఉన్న 'ఎమ్మెల్యే' స్టిక్కర్‌ను పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కీలక నిందితురాలు పార్వతి కోసం గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa